కన్నన్ విద్యాసంస్థలో బాలికల హాస్టల్ ప్రారంభం

చిత్తూరు, జూలై 18 (రాజనీతి): చిత్తూరులోని కన్నన్ విద్యాసంస్థల బాలికల హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. సుమారు 120 మంది విద్యార్థినులకు సురక్షిత వసతి కల్పించే ఈ హాస్టల్‌తో పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం బాలికల విద్యాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు.