పోక్సో చట్టం, బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన

ఏ. కొండూరు, జూలై 17 (రాజనీతి): ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టం, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జి. మహాలక్ష్ముడు మాట్లాడుతూ మంచి స్పర్శ–చెడు స్పర్శ, సైబర్ నేరాల నివారణ, సామాజిక మాధ్యమాల బాధ్యతాయుత వినియోగంపై విద్యార్థులకు వివరించారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. వేధింపులు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 112, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.