ముక్కోటి ఆలయానికి ఎకరా స్థలం కేటాయింపు

చంద్రగిరి, ఆగస్టు 11 (రాజనీతి): తొండవాడ సమీపంలోని స్వర్ణముఖి నది తీరంలో వెలసిన శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ఎకరా స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌ డా.ఎస్‌.వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆలయ ట్రస్టీ మొగిలి సుందరరామిరెడ్డి హార్టికల్చర్‌, సెరికల్చర్‌ భవనాల కోసం స్థలాన్ని కేటాయించగా, ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనంతో సహా స్థలాన్ని ఆలయానికి తిరిగి కేటాయించారు. మంగళవారం కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని నవీన్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. త్వరలో ఈ స్థలంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.