🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Jul, 2026 | Page: 1

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో గోదావరిలో తగ్గిన జలాలు రైతులకు ప్రభుత్వం అత్యవసర సూచనలు

అమరావతి: రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో గోదావరి నదిలోకి నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో సాగునీటి వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది.

నీటిపారుదల శాఖ అధికారుల వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం భారీగా లోటులో ఉంది. గోదావరిలో జూలై నెలలో సాధారణంగా ఉండే ప్రవాహంతో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ నీరు మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి గత కొన్ని దశాబ్దాల్లో అరుదుగా నమోదైందని పేర్కొన్నారు.

ప్రభుత్వం తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూనే, అందుబాటులో ఉన్న నీటితో సాగునీటిని సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపడుతోంది. గోదావరి డెల్టాలో సాధ్యమైనంత వరకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను పరిశీలించాలని అధికారులు సూచించారు.

వ్యవసాయ, ఉద్యాన శాఖలు జిల్లా వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను సిద్ధం చేశాయి. వాతావరణ పరిస్థితులు, జలాశయాల నీటి మట్టాలు, నదుల ప్రవాహాలను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.
🏠 Home