🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Jul, 2026 | Page: 1

విద్యార్థుల ఐక్య ఉద్యమాలకు ఇది చారిత్రాత్మక విజయం – ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ

విద్యార్థుల పోరాట విజయమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా


మదనపల్లి, 2026 జూలై 25:

నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన నిరంతర పోరాటాల ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు పొందాయని, చివరకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి మంత్రి రాజీనామా చేయాల్సి రావడం విద్యార్థుల ఐక్య పోరాట శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే ఫలితం సాధించవచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అణచివేయాలని ప్రయత్నించినా, వారి ఐక్యత ముందు అధికార అహంకారం నిలవలేదని వ్యాఖ్యానించారు.

నీట్ పరీక్షల వ్యవహారంలో జరిగిన అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు.

దేశ యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యను కార్పొరేట్ ప్రయోజనాలకు బలి చేయకుండా ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాలని సాంబశివ అన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జరిగే ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
🏠 Home