🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Jul, 2026 | Page: 1

ప్రతి వార్డులో మౌలిక వసతులే లక్ష్యం.. ప్రజల మద్దతు కోరిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

చిత్తూరు అభివృద్ధికి వేగం.. రూ.30.80 లక్షల పనులకు ఎమ్మెల్యే గురజాల శ్రీకారం ...

సిమెంట్ రోడ్లు–కాలువల ప్రారంభం.. తేనెబండలో అభివృద్ధి పనులకు ఊపు....


చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని తేనెబండ ప్రాంతంలో రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను శనివారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత రెండేళ్లలో అనేక వార్డుల్లో సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం పూర్తి చేశామని ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా దశలవారీగా పనులు చేపట్టి నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణతో పాటు ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆదరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు.అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రానికి ఎమ్మెల్యే టెలివిజన్‌ను అందజేశారు. చిన్నారుల విద్యా, వినోద అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే హయగ్రీవ పాఠశాలకు వెళ్లే రోడ్డుకు జీజేఎం రోడ్డు' గా నామకరణం చేశారు. అనంతరం స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానిక మహిళలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ మేయర్ అముద, కూటమి నాయకులు రాజేష్‌కుమార్‌రెడ్డి, పచ్చయప్ప, వరదరాజులు, డివిజన్ కమిటీ సభ్యులు, ఇన్‌చార్జులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
🏠 Home