రాష్ట్ర వైద్యానికి ‘సంజీవని’ జవసత్వాలు 10.51 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య ఖాతాలు-వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ Satya Kumar Y గారు
2.48 లక్షల మంది రోగులకు వైద్యులతో నేరుగా అపాయింట్మెంట్లు
ఎన్సీడీ 4.0 కింద గుర్తించిన 2.72 కోట్ల మంది ఆరోగ్య వివరాలు సంజీవనితో అనుసంధానం
'ఆర్బియస్కె' విద్యార్థుల వివరాలు కూడా
రేపు కర్నూలు జిల్లా ఆస్పరిలో 'సంజీవని'ని ప్రారంభించనున్న సీఎం శ్రీ Nara Chandrababu Naidu గారు
వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ Satya Kumar Y గారు వెల్లడించారు
గ్రామంలో పరీక్ష చేయించుకున్న రోగి జిల్లా, బోధనాస్పత్రికి వెళ్లినా.. అతడి ఆరోగ్య చరిత్ర వెంటనే వైద్యుల ముందుకు వచ్చేలా రాష్ట్రంలో డిజిటల్ వైద్య వ్యవస్థ విస్తరిస్తోంది. పరీక్షలు, మందులు, వైద్య సంప్రదింపులు, రిఫరల్, తదుపరి చికిత్స.. ఇలా రోగికి సంబంధించిన ప్రతి సేవను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ‘ప్రాజెక్టు సంజీవని’ రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా మారుతోంది.
కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 10.51 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య ఖాతాలను డిజిటల్ విధానంలో రూపొందించారు. వైద్య సేవలు పొందేందుకు 10.06 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలను అనుసంధానం చేశారు. రోగి ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్య సమాచారానికి ఇబ్బంది లేకుండా .. చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షించే వ్యవస్థను దశలవారీగా బలోపేతం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో శనివారం సంజీవని కార్యక్రమాన్ని సీఎం శ్రీ Nara Chandrababu Naidu గారు ప్రారంభించనున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ Satya Kumar Y గారు నేడొక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పురోగతిని మంత్రి గారు వివరించారు.
ఒక్కొక్కరికీ ఒక్కో ఆరోగ్య ఖాతా
సంజీవని ద్వారా ప్రతి వ్యక్తికి ప్రత్యేక డిజిటల్ ఆరోగ్య ఖాతాను రూపొందిస్తున్నారు. గతంలో వచ్చిన వ్యాధులు, వైద్యులు సూచించిన పరీక్షలు, ప్రయోగశాల ఫలితాలు, వాడిన మందులు, ఆస్పత్రుల్లో పొందిన చికిత్స, తదుపరి వైద్య సూచనలను ఇందులో నమోదు చేస్తున్నారు. గ్రామ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందిన వ్యక్తి మెరుగైన వైద్యం కోసం పీహెచ్సీ, ఏరియా, జిల్లా లేదా బోధనాస్పత్రికి వెళ్లినా.. అప్పటివరకు నమోదైన ఆరోగ్య వివరాలు వైద్యులకు క్షణాల్లో అందుబాటులోకొస్తాయి. పాత నివేదికలు తీసుకెళ్లకపోయినా గత చికిత్స వివరాలను పరిశీలించి వైద్యం అందించే అవకాశముంటుంది. దీనివల్ల వ్యాధుల నిర్ధారణ పరీక్షల ఫలితాలు, గతంలో వాడిన మందులు తెలియకపోవడం, వైద్య నివేదికలు అందుబాటులో లేక చికిత్స ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు తగ్గుతాయి.
కుప్పం నుంచి ప్రారంభమై...
చిత్తూరు జిల్లా కుప్పంలో జులై 3,2025, జనవరి 13, 2026న చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో, మార్చి 15 నుంచి దశలవారిగా మే 23 నాటికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. జూన్ 27,2026న మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టి పిహెచ్సి పరిధిలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గణాంకాలవారీగా
10.51 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య ఖాతాలు రూపొందించారు.
10.06 లక్షల మందికి పేర్లతో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు( అభా) సృష్టించారు.
3.62 లక్షల మందికి వైద్యుల నుంచి అపాయింట్మెంట్లు ఇప్పించారు.
2.48 లక్షల మంది రోగులు వైద్యుల్ని సంప్రదించారు.
రోగుల్లో అవసరమైన వారికి ఇప్పటి వరకు 14.66 లక్షల మందుల్ని అందజేశారు. అలాగే రోగులందరికీ కలిపి
31,555 ల్యాబ్ పరీక్షలు జరిగాయి.
రోగుల్లో 1.60 లక్షల మందికి ఫాలోఅప్ వైద్యం గురించి ఫోన్ ద్వారా తెలియజేశారు
డిజిటల్ నర్వ్ సెంటర్ లో ఉన్న ఎంబిబియస్ వైద్యులు , స్పెషలిస్టులు కలిపి 7,000 మంది రోగులకు వైద్య సేవల్ని అందించారు..
రిఫర్ చేయడంతో వదిలేయకుండా..
రోగిని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి పంపించిన తర్వాత అక్కడకు చేరారా? వైద్యుడిని కలిశారా? సూచించిన పరీక్షలు చేయించుకున్నారా? మందులు తీసుకుంటున్నారా? తిరిగి పరీక్షకు హాజరయ్యారా? అనే వివరాలను సంజీవని ద్వారా తెలుసుకుంటున్నారు. రిఫరల్, టెలివైద్య సంప్రదింపులు, నిపుణుల సూచనలు, ప్రయోగశాల పరీక్షలు, మందుల పంపిణీ, తదుపరి అపాయింట్మెంట్లు, ఫాలోఅప్ సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానిస్తున్నారు.
2.72 కోట్ల మంది ఆరోగ్య వివరాలతో అనుసంధానం*
అసంక్రమిత వ్యాధుల గుర్తింపు కార్యక్రమం–4.0 కింద రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 2.72 కోట్ల మంది ఆరోగ్య వివరాలను సంజీవనితో అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడంతోపాటు.. బాధితులకు చికిత్స అందుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్ బియస్కె) కింద చిన్నారులకు నిర్వహిస్తున్న పరీక్షలు, అలాగే గర్భిణిల నమోదు, ప్రసవానికి ముందు పరీక్షలు, హై రిస్క్ గర్భిణుల వివరాలను కూడా ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు.
ఆస్పరి పీహెచ్సీ పరిధిలో 35 వేల మందికి...*
సంజీవని సేవల విస్తరణలో భాగంగా శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆస్పరి పీహెచ్సీ పరిధిలోని సుమారు 35 వేల మందిని సంజీవని పరిధిలోకి తీసుకురానున్నారు.
రోగి వెంట వైద్య వ్యవస్థ నడవాలి
“రోగి గ్రామంలో చికిత్స పొంది.. జిల్లా లేదా బోధనాస్పత్రికి వెళ్లినా వైద్య సేవల్లో అనుసంధానం ఉండాలి. మరో ఆస్పత్రికి పంపించడంతో బాధ్యత ముగిసినట్లు కాకుండా, చికిత్స కొనసాగింపును పర్యవేక్షించాలి. వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్యం అందించి, రోగి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించడమే సంజీవని లక్ష్యం” అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ Satya Kumar Y గారు తెలిపారు.