🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

సిజేరియన్లన్నీ ఇక ఆడిట్‌ పరిధిలోకి వైద్య అవసరముంటేనే.. సిజేరియ‌న్ చేయాలి ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌
23-07-2026
అమ‌రావ‌తి

సిజేరియన్లన్నీ ఇక ఆడిట్‌ పరిధిలోకి

వైద్య అవసరముంటేనే.. సిజేరియ‌న్ చేయాలి

ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ఆదేశాలు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నిర్వహించే సిజేరియన్‌ ప్రసవాలు ఇకపై ఆడిట్‌ పరిధిలోకి రానున్నాయి. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కేసులో సిజేరియ‌న్‌ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది.

డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్ర‌స్టు ప‌రిధిలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాల సంఖ్య అధికంగా ఉoడడoపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆరా తీశారు. వైద్యపరమైన అవసరం లేకుండా సిజేరియన్లు నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు
డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి చ‌క్ర‌ధ‌ర్‌బాబు అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సర్క్యులర్‌ జారీ చేశారు. తాజా ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆస్పత్రుల యాజమాన్యాలకు స్పష్టంచేశారు.

సిజేరియన్ కు దారీతీసిన కారణాలపై నమోదు జరగాలి

తల్లీబిడ్డ‌ల‌ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వైద్యపరంగా అవసరమని నిర్ధారించినప్పుడే సిజేరియన్‌ ప్రసవం నిర్వహించాలి. నిర్దేశిత వైద్య విధానాలు, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలు, చట్టబద్ధ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ప్రతి సిజేరియన్ కు దారితీసిన వైద్య పరిస్థితులను స్పష్టంగా నమోదు చేయాలి. వైద్యుల పరిశీలనలు, పరీక్షల ఫలితాలు, చికిత్స వివరాలు, సిజేరియన్‌ను సమర్థించే ఇతర రికార్డులను ఆసుపత్రుల్లో భద్రపరచాలి.

చర్యలు త‌ప్ప‌వు

పథకం కింద నిర్వహించే సిజేరియన్‌ కేసులను వైద్యసేవ ట్రస్ట్‌ లేదా సంబంధిత అధీకృత‌ అధికారి ఆడిట్‌ చేస్తారు. వైద్యపరమైన కారణాలు సరిగా నమోదు చేయకపోయినా, అవసరమైన రికార్డులు లేకపోయినా, నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తారు. నిబంధనలను పాటించని ఆసుపత్రులపై ఎంపానెల్‌మెంట్‌ ఒప్పందంలోని నిబంధనలు, షరతుల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ సీఈఓ హెచ్చ‌రించారు.

ప్రతి రోగికీ డిజిటల్‌ ఆరోగ్య రికార్డు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం కింద ఏదైనా వైద్య ప్రక్రియలో చేపట్టే ముందు అర్హత కలిగిన ప్రతి రోగికి ఆభా గుర్తింపు సంఖ్యను రూపొందించాలి. రోగికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డును తప్పనిసరిగా నిర్వహించాలి.
ఆభా గుర్తింపు సంఖ్య, ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డు రూపొందించకుండా పథకం కింద ఎలాంటి వైద్య ప్రక్రియనూ చేపట్టరాదని ట్రస్ట్‌ తేల్చిచెప్పింది.

వైద్యుల పేర్ల నమోదు

రోగుల చికిత్సలో పాల్గొనే వైద్యులు, ఇతర ఆరోగ్య వృత్తి నిపుణులందరూ ఆరోగ్య వృత్తి నిపుణుల రిజిస్ట్రీలో నమోదై ఉండేలా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నిబంధనలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ పేర్కొంది.
🏠 Home