స్నేహబంధం చాటిన ఇద్దరు ఎమ్మెల్యేలు....
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):ప్రపంచ జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో అధికారిక కార్యక్రమాల మధ్య చోటుచేసుకున్న ఓ ఆప్యాయ దృశ్యం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వేదికపై పక్కపక్కనే కూర్చొని సన్నిహితంగా ముచ్చటించారు. నవ్వులు పంచుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. సమావేశం కొనసాగుతుండగా ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం ఆత్మీయంగా సంభాషించుకోవడం, చిరునవ్వులతో ఒకరినొకరు పలకరించుకోవడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించగా, హాజరైన నాయకులు, రైతులు, ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. మామిడి రైతుల సంక్షేమం, పంటకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ అవకాశాలపై సమావేశంలో చర్చలు సాగుతుండగా, వేదికపై కనిపించిన ఈ స్నేహపూర్వక క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారిక కార్యక్రమాల మధ్య కనిపించిన ఈ అనుబంధం సభలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో బాధ్యతలతో పాటు పరస్పర గౌరవం, ఆప్యాయత కూడా ఎంత ముఖ్యమో ఈ దృశ్యం గుర్తు చేసింది.