🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 21 Jul, 2026 | Page: 1

దేశంలో ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుందో ప్రజలంతా చూస్తున్నారు’.. పోలీసు చర్యల అనంతరం రాహుల్ గాంధీ స్పందన!

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తంగా మారిన రాజధాని రాజకీయాలు

న్యూఢిల్లీ, జూలై 22:

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేతృత్వంలో కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా, పోలీసులు ఆయనను, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నిరసన ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో కొంతసేపు చర్చించినప్పటికీ, పరిస్థితిలో మార్పు రాలేదు. అనంతరం పోలీసులు నిరసనను విరమింపజేశారు.

పోలీసులు తరలించే సమయంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం స్పందించిన రాహుల్ గాంధీ, "దేశంలో ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుందో ప్రజలంతా చూస్తున్నారు" అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

మరోవైపు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా, ఈ పరిణామం దేశ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
🏠 Home