🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Jul, 2026 | Page: 1

అర్హులైన ప్రతి కుటుంబానికీ 'తల్లికి వందనం' అందాలన్నదే ఎమ్మెల్యే లక్ష్యం... మహబూబ్ బాషా

రేణిగుంట, జూలై 15 (రాజనీతి): విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం తప్పనిసరిగా చేరేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పథకం అమలు సజావుగా సాగేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, అర్హులైన ఒక్క విద్యార్థి కూడా పథకానికి దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు సరైన సమాచారం అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పథకానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆధార్–బ్యాంకు ఖాతా అనుసంధానం, ఎన్.పి.సి.ఐ. మ్యాపింగ్, బ్యాంకు ఖాతా యాక్టివ్ స్థితి, విద్యార్థి వివరాలు, కుటుంబ వివరాలు సక్రమంగా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని కోరారు. ఏవైనా వివరాల్లో పొరపాట్లు ఉంటే ఆలస్యం చేయకుండా సచివాలయ సిబ్బంది సహకారంతో వెంటనే సరిచేయించుకోవాలని తెలిపారు. చిన్నపాటి సాంకేతిక లోపాల కారణంగా కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందని, అందుకే ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తోందని, అందువల్ల ఖాతా వివరాల ఖచ్చితత్వం ఎంతో కీలకమని మహబూబ్ బాషా పేర్కొన్నారు. విద్యార్థుల చదువు ఆగకూడదు... తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గాలి... అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరాలి అనే సంకల్పంతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి విద్యార్థి కుటుంబం వెంటనే తమ వివరాలను ధృవీకరించుకుని, ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకం ప్రయోజనాలను పూర్తిగా పొందాలని మహబూబ్ బాషా విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందే ప్రతి సంక్షేమ పథకం నిజమైన లబ్ధిదారుల వద్దకే చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
🏠 Home