🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 12 Jul, 2026 | Page: 1

రూ.45 కోట్లకు పైగా అభివృద్ధి పనులతో చిత్తూరు నగరానికి కొత్త రూపు కమిషనర్ నరసింహ ప్రసాద్...

రోడ్లు.. డ్రైన్లు.. తాగునీరు.. చిత్తూరులో వేగంగా అభివృద్ధి....


నగరాభివృద్ధికి భారీ పెట్టుబడులు.. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి...


చిత్తూరులో అభివృద్ధి పరుగులు.. కోట్ల రూపాయల పనులు పూర్తి దశలో...


ప్రజల అవసరాలే లక్ష్యం.. చిత్తూరులో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు...






చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మార్గదర్శకత్వంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రత్యేక చొరవతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సరఫరా, స్టోమ్ వాటర్ డ్రైన్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, లైటింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.నగర ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా పలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే రూ.738.94 లక్షల వ్యయంతో రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, తాగునీటి సరఫరా మెరుగుదలకు సంబంధించిన పనులు చేపట్టినట్లు తెలిపారు. దీంతో అనేక కాలనీల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశుద్ధ్య పరిస్థితులు కూడా గణనీయంగా మెరుగయ్యాయని చెప్పారు. అలాగే రూ.180 లక్షలతో బీటీ రోడ్డు, ఫారెస్ట్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి రాకపోకలకు అనువుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. కట్టమంచి నుంచి సంతపేట వరకు నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ.332.14 లక్షల వ్యయంతో ఈఎల్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణం, పైప్‌లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే తాగునీటి సరఫరా మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు.వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలను నివారించేందుకు సాంబయ్యకండిగ వై జంక్షన్ వద్ద రూ.509 లక్షలతో బీటీ రోడ్డు, స్టోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా సంతపేటలో రూ.140 లక్షలతో స్టోమ్ వాటర్ డ్రైన్ నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఈ పనుల వల్ల వర్షపు నీరు వేగంగా వెళ్లిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తగ్గనున్నాయని వివరించారు.నగర ప్రధాన రహదారుల అభివృద్ధిలో భాగంగా గాంధీ రోడ్డు నుంచి లిల్లీ బ్రిడ్జి వరకు రూ.367.54 లక్షలతో రోడ్డు విస్తరణ, ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనదారులకు మెరుగైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.దర్గా సర్కిల్ నుంచి న్యూట్రిన్ ఫ్యాక్టరీ వరకు పలమనేరు రోడ్డు విస్తరణ పనులకు రూ.212 లక్షలు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ రహదారి విస్తరణతో నగరంలో ట్రాఫిక్ సమస్యలకు కొంత మేర ఉపశమనం లభిస్తుందని చెప్పారు.ఇదిలా ఉండగా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.18.88 కోట్ల భారీ వ్యయంతో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వాటర్ వర్క్స్, ఆధునిక లైటింగ్ వ్యవస్థల ఏర్పాటు వంటి సమగ్ర అభివృద్ధి పనులు అమలవుతున్నాయని కమిషనర్ వివరించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి వార్డులో మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ నాణ్యత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే లక్ష్యంతో మరిన్ని అభివృద్ధి పనులను కూడా దశలవారీగా చేపట్టనున్నట్లు కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ప్రజల సహకారంతో చిత్తూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
🏠 Home