🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 08 Jul, 2026 | Page: 1

రూ.25 లక్షల సీఎస్ఆర్ నిధులతో కందూరు వంక ఆనకట్ట పునర్నిర్మాణం...‌అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

సోమల మండలం కందూరు వంక వద్ద ఆరేళ్లుగా మరమ్మతులకు నోచుకోక రైతులను వేధిస్తున్న సాగునీటి కష్టాలకు తెరపడనుంది. ఈ ఆనకట్టను పునర్నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి రూ.25 లక్షలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డైవర్షన్ ఆనకట్టను నిర్మిస్తున్నామని, తద్వారా నిలిచిపోయిన సాగునీటి సరఫరాను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన పరిపాలనా అనుమతులు పూర్తయ్యాయని, పనులను తక్షణమే ప్రారంభించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వంకలోకి చేరేలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

ఈ ఆనకట్ట పునర్నిర్మాణం పూర్తయితే రాయకుట్టు పెద్ద చెరువు (105 ఎకరాలు), బాపనకుంట (15 ఎకరాలు), జలవాలకుంట (14.95 ఎకరాలు), గొల్లవానికుంట (5 ఎకరాలు), పుల్లివానికుంట (9 ఎకరాలు) వంటి మొత్తం ఐదు చెరువులకు నీటి సరఫరా అందుతుందన్నారు. దీనివల్ల 148.95 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చి, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన కాల్వలకు ఈ కొత్త ఆనకట్టకు అనుసంధానం చేయనున్నా మని తెలిపారు.కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ వెంకటరామయ్య, డీఈ, ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home