🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Jul, 2026 | Page: 1

పాకాల మండల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే పులివర్తి నాని

పాకాల, జూలై 6 (ప్రతినిధి): పాకాల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ అధ్యక్షుడు లోకనాథం ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి ప్రతి శాఖ అధికారి విధిగా హాజరుకావాలని సూచించారు. సమావేశంలో లేవనెత్తిన ప్రతి సమస్యను నమోదు చేసి, సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని, అధికారులు అలాంటి ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారులకు పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మామిడి రైతుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటోందని, రైతులకు కూటమి ప్రభుత్వంలోనే నిజమైన భరోసా లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పాకాల మండలంలో కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, వంతెనలు, చారిత్రాత్మక ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.

సమావేశం అనంతరం పదవీకాలం ముగియనున్న జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా సత్కరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చంద్రగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
🏠 Home