🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 30 Jun, 2026 | Page: 1

లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. కార్యకర్తలకే ప్రవేశం: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తపాలెం సమీపంలోని సభా ప్రాంగణాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సుమారు 500 బైక్‌లతో భారీ ర్యాలీగా సభా వేదికకు తీసుకువస్తామని చెప్పారు. అనంతరం ఉత్తమంగా పనిచేసిన సుమారు 210 మంది కార్యకర్తలను సన్మానించి, వారితో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు, కేసులు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీని బలోపేతం చేశారని కొనియాడారు. కార్యకర్తలకు మరింత మనోధైర్యం కల్పించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇది పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశం అని, ముందుగా ఎంపిక చేసిన జాబితాలో ఉన్న సుమారు 1,500 మంది కార్యకర్తలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు సభకు రావద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశం అంతర్గత కార్యక్రమం కావడంతో మీడియాకు కూడా లోపల ప్రవేశం ఉండకపోవచ్చని, అవసరమైన ఫొటోలు, విజువల్స్‌ను పార్టీ తరఫున అందజేస్తామని తెలిపారు. సమావేశం అనంతరం లోకేష్ తిరుమలకు బయలుదేరనున్నట్లు వెల్లడించారు.
🏠 Home