🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Jun, 2026 | Page: 1

తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

గుర్రంకొండ, జూన్ 27:
జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.

శనివారం గుర్రంకొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలు నెం.16, 17 పరిధిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి బూత్ లెవల్ అధికారులు (BLOలు) నిర్వహిస్తున్న సర్ ఏన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియ, ఓటరు వివరాల సేకరణ, ఆన్‌లైన్ డిజిటలైజేషన్ పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..., ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకత అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతి అర్హ ఓటరికి సంబంధించిన సమాచారం సక్రమంగా నమోదు చేసి, సేకరించిన వివరాలను ఆలస్యం లేకుండా డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. బీఎల్ఓలకు కేటాయించిన విధులు, బాధ్యతలను వారే వ్యక్తిగతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులను అనధికార వ్యక్తులకు అప్పగించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అలాగే ఓటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు, సంబంధిత వర్గాలందరితో సమానత్వం, నిష్పాక్షికత పాటిస్తూ వ్యవహరించాలని తెలిపారు. ఓటరు జాబితాపై ఎలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చినా వెంటనే పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసి, ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home