ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా ఈనెల 20న కలెక్టరేట్ ఎదుట ధర్నా: మాల మహానాడు
మదనపల్లె : ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ విధానానికి వ్యతిరేకంగా జూన్ 20వ తేదీన మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్లజెండాలతో నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం పిలుపునిచ్చారు. మంగళవారం మదనపల్లె పట్టణం నిమ్మనపల్లి సర్కిల్లోని మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటే పార్లమెంటులో చట్టం చేసి, అన్ని రాష్ట్రాల అనుమతి పొందిన తర్వాతే అమలు చేయాలి తప్ప.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుదర్శనం స్పష్టం చేశారు. ఈ అప్రజాస్వామిక వర్గీకరణను మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి వి. హరి, యమలా చంద్రయ్య, గుండా మనోహర, మల్లెల మోహన, లక్ష్మీపతి, మర్రిపాటి ప్రశాంత్, వెంకటస్వామి, నాగార్జున, సతీష్, శ్యాముల్, విజయ్ కుమార్, సురేష్, కొత్తపల్లె మనీ, కృపామణి, ఈశ్వర్ రెడ్డి, రాజేంద్ర, గంగన్న తదితరులు పాల్గొన్నారు.