అభివృద్ధి కొనసాగాలంటే కూటమికే అండ...చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన–ఇంటింటి ప్రచారం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి చిత్తూరు నగరపాలక పరిధిలోని 12వ వార్డు రామాపురం గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ‘సూపర్ సిక్స్’ హామీల అమలు తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలను వివరించే కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు.ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రతి ఇంటికీ వెళ్లి స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకోవడంతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజల ఆశీస్సులతో చిత్తూరు నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రవి, గోపి, శేటు, వెంకటేష్ యాదవ్, ఈశ్వరరావుతో పాటు తెదేపా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.