🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 30 Jul, 2026 | Page: 1

ఎవరినీ కించపరచలేదు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్....

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):బెంగళూరు, చెన్నై నగరాలను చిత్తూరు వారు ఏలుతున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని కొందరు రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించి అనవసర వివాదానికి తెరలేపారని ఆరోపించారు. తెలుగు ప్రజలు దేశంలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా తమ ప్రతిభ, కృషి, నైపుణ్యంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు.
తాను చేసిన వ్యాఖ్యలు ఏ రాష్ట్రాన్ని, ఏ భాషను లేదా అక్కడి ప్రజలను కించపరిచేలా లేవని, అలాంటి ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగు వారి ప్రతిభను, కష్టపడే తత్వాన్ని ప్రశంసించే క్రమంలోనే ఆ మాటలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలను సందర్భానికి విరుద్ధంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తన రాజకీయ విధానం కాదని, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని సంస్కృతుల పట్ల తనకు గౌరవం ఉందని గురజాల జగన్ మోహన్ వెల్లడించారు. దేశ సమైక్యత, పరస్పర గౌరవమే తన అభిమతమని చెప్పారు.అయితే తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే వారికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన మాటలను సరైన సందర్భంలోనే అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తెలుగు వారి ప్రతిభను చాటిచెప్పడమే తన ఉద్దేశమని మరోసారి స్పష్టం చేశారు.
🏠 Home