🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 28 Jul, 2026 | Page: 1

యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.

పత్రికా ప్రకటన - తేదీ: 28.07.2026
అన్నమయ్య జిల్లా - మదనపల్లి

యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారు.

అన్నమయ్య జిల్లాలో మొట్ట మొదటి సారి కరుడుగట్టిన గంజాయి స్మగ్లర్‌పై 'పిట్ ఎన్‌డిపిఎస్' ప్రయోగం.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు..

నిందితుడిపై గుర్రంకొండ పీఎస్‌లో సస్పెక్ట్ షీట్ ఓపెన్..

మదనపల్లె, జులై 28: అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారు తెలిపారు. మంగళవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గుర్రంకొండకు చెందిన కలకడ ఆదిల్ అనే వ్యక్తి రహస్యంగా గంజాయి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ గారు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా పదేపదే నేరాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్థుడు కావడంతో, ఇతని కదలికలపై నిరంతరం నిఘా ఉంచేందుకు గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌లో 'సస్పెక్ట్ షీట్ నెం. 111' ను ఓపెన్ చేశామన్నారు.

ఆదిల్‌పై ఇప్పటివరకు 5 గంజాయి కేసులు నమోదయ్యాయని, గతంలో అతని నుంచి 28 కిలోల గంజాయిని పట్టుకున్నామని ఎస్పీ గారు వివరించారు. ఇవే కాకుండా దొంగతనాలు, దాడులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి మరో 5 క్రిమినల్ కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. గంజాయి మత్తులో యువత దొంగతనాలు, దోపిడీల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి నేరస్థుల వల్ల సమాజానికి పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపగా, ప్రభుత్వం ఆదిల్‌పై అత్యంత కఠినమైన 'పిట్ ఎన్‌డిపిఎస్' (PIT NDPS - Act Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988) చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్పీ గారు తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

జిల్లాలో మాదక ద్రవ్యాలు అమ్మినా, రవాణా చేసినా ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఎస్పీ గారు హెచ్చరించారు.

గంజాయి అమ్మకాలపై ప్రజలకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డయల్-112 కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి గారు, రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, వాయల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవ రెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ, రవీంద్ర బాబు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home