🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 28 Jul, 2026 | Page: 1

జపాన్‌ను వణికించిన 7.1 తీవ్రత భూకంపం.. సునామీ హెచ్చరికతో తీరప్రాంతాల్లో హై అలర్ట్!

టోక్యో: జపాన్ దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం శక్తివంతమైన 7.1 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంపం అనంతరం 1 మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో తీరప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

భూకంప కేంద్రం కుమమోటో ప్రిఫెక్చర్ సమీపంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కుమమోటోతో పాటు నాగాసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రాంతాలకు అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు.

సునామీ ముప్పు దృష్ట్యా తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర తీరాలకు వెళ్లకుండా, వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని జపాన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అలాగే భూకంపం వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అనంతర ప్రకంపనలు (Aftershocks) వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో జపాన్ ఒకటి. 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో అక్కడ తరచూ భారీ భూకంపాలు నమోదవుతుంటాయి. ఈ తాజా ఘటనతో మరోసారి అత్యవసర యంత్రాంగం అప్రమత్తమైంది.
🏠 Home